లండన్/న్యూఢిల్లి: ఆదాయం పరంగా ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా ఉన్న వోడాఫోన్ భారత్లో ఎస్సార్ కార్యకలాపాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 5 బిలియన్ డాలర్లను (సుమారు 22,250 కోట్ల రూపాయలు) చెల్లించేందుకు సంస్థ ప్రాధమిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వోడాఫోన్, ఎస్సార్ గ్రూప్లు ఇండియాలో జాయింట్ వెంచర్ను ప్రారంభించి వోడాఫోన్ ఎస్సార్ పేరిట టెలికం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా జాయింట్ వెంచర్లోని 33 శాతం ఎస్సార్ వాటాలను వోడాఫోన్ కొనుగోలు చేయడంతో పాటు త్వరలో ఐపిఒకు వెళ్ళి నిధులను సేకరించాలని కూడా భావిస్తోంది. కాగా, 2007లో టెలికం రంగంలోకి వచ్చిన వోడాఫోన్ ఆది నుంచి అమితమైన పోటీని ఎదుర్కొంటూ నిలదొక్కుకోవడంలో విజయం సాధించింది.
ఎస్సార్ 33 శాతం వాటాలను కొనుగోలు చేస్తే వోడాఫోన్కు 75 శాతం వరకూ వాటా పెరుగుతుందని అంచనా. దేశంలో నిబంధనలను అనుసరించి ఏ లిస్టెడ్ కంపెనీలో కూడా 74 శాతానికి మించి ప్రమోటర్ వాటా ఉండకూడదు. ఈ నేపథ్యంలో ఒక శాతం వాటాను ఐపిఒ ద్వారా విక్రయించాల్సి వుంటుంది. ఇదే సమయంలో మరింత వాటాలను ఉపసంహరించుకుని సంస్థ అభివృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
నవంబర్ నాటికి ఫైనల్ సెటిల్మెంట్ను చేయనున్నామని వివరించారు. ఈ డీల్ విలువ, లావాదేవీలో పొందుపరిచిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించాల్సి వుంది. 2007లో వోడాఫోన్ 11.1 బిలియన్ డాలర్లు చెల్లించి హచ్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూపంలో వచ్చిన అత్యధిక నిధుల మొత్తం ఈ డీల్దే కావడం గమనార్హం. ఎస్సార్ వాటాలను కొనుగోలు చేసిన తరువాత సంస్థలో వోడాఫోన్ వాటా ఎంతకు పెరుగుతుందన్న విషయం స్పష్టంగా వెల్లడికావాల్సి వుంది. ఈ విషయంలో కంపెనీ కూడా స్పందించలేదు. టెలికం రంగంలో ఎఫ్డిఐ అవధి 74 శాతం కాగా, వోడాఫోన్ దాన్ని అధిగమించకుండా డీల్ను పూర్తి చేయాల్సి వుంది.
No comments:
Post a Comment