Friday, April 22, 2011

ప్రకృతీ విలపిస్తోంది బాబా..క్షణమొక యుగంగా..


  • మరింత బలహీనమైన హృదయ స్పందన 
  • పూర్తిగా క్షీణించిన కిడ్నీల పనితీరు 
  • ట్రస్ట్‌ కీలక సమావేశం 
  • ప్రశాంతి నిలయం పరిసరాల్లో రెడ్‌ అలర్ట్‌ 
  • అశేషంగా తరలివస్తున్న భక్తజనం
శ్లోకంలో శోకం... వేదంలో ఖేదం
ఏమిటీ పరీక్ష... ఎవరికీ విషమ పరీక్ష?
బాబా భౌతిక దేహానికా, ఆధ్యాత్మిక మనుగడకా?
సర్వం సాయిమయమని విశ్వసించిన
భక్తజన కోటి మూగగా రోదిస్తోంది...
దీనికి ప్రకృతి కూడా అకాల వర్షాలతో జత కలుస్తోంది..
గంటగంటకూ విడుదలవుతున్న హెల్త్‌ బులెటిన్లు
భక్తుల గుండెల్లో పిడుగులు రాలుస్తున్నాయి
అటు ఆకాశంలో ఉరుములు, మెరుపులతో వడగళ్లు కురుస్తున్నాయి
ఇంతటి విషాదం మధ్య దైవత్వాన్నే ప్రశ్నిస్తూ
తీతువు పిట్టలు కూస్తున్నాయి-
నిషాదోన్మాద శక్తులు ధర్మసూక్ష్మాన్ని అవహేళన చేస్తున్నాయి!
ఆ దేహం నీది కాదని వారికెలా చెప్పేది?
ఈ సందేహం నుంచి భక్తులనెలా ఒప్పించేది??
పుట్టపర్తి, కెఎన్‌ఎన్‌ ప్రతినిధి: సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి 'అత్యంత విషమం'గానే ఉంది. గత 26 రోజులుగా వివిధ అవయవాల అస్వస్థతతో ఇక్కడి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా మందులు, వైద్య పరికరాల సహాయంతోనే ప్రాణాన్ని కాపాడుకుంటున్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. ఆయన కాలేయం, కిడ్నీల పనితీరు పూర్తిగా క్షీణించింది. సిఆర్‌టిఆర్‌ (హీమో డయాలిసిస్‌) ద్వారా చికిత్సనందిస్తున్నారు. హృదయానికి పేస్‌మేకర్‌ అమర్చినప్పటికీ బ్లడ్‌ప్రెషర్‌ లెవల్‌ 60కి పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటిలేటర్‌ సహాయంతో శ్వాస అందిస్తున్నారు. ఇక ఐవి ప్లూయిడ్‌ ద్వారా జీవరక్షక మందులను, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా యాంటీ బయోటిక్స్‌ను నిరంతరం బాబా దేహానికి సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ చికిత్సకు బాబా స్పందించడంలేదు. ఇది వైద్యులను కలవరపాటుకు గురిచేస్తోంది.
దీంతో భగవాన్‌ సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి దినమొక యుగంగా గడుస్తోంది. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని బాబా భక్తకోటి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పుట్టపర్తిలో పరిస్థితి అత్యంత ఉద్విగ్నభరితంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సత్యసాయి ఆస్పత్రి వద్ద, ప్రశాంతి నిలయంలో, పట్టణవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమ ఐజి సంతోష్‌ మెహ్రా, డిఐజి చారుసిన్హా, అనంతపురం జిల్లా ఎస్‌పి షానవాజ్‌ ఖాసింల నేతృత్వంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కీలక సమావేశం
మంత్రి గీతారెడ్డి సత్యసాయి ఆస్పత్రి భవనంలో ప్రభుత్వ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులతో శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. బాబా ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండడంతో తాజా పరిస్థితిపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అనుకోనిది ఏదైనా జరిగితే తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత తదితర అంశాలపైన చర్చించి ముఖ్యమంత్రికి నివేదిక పంపినట్లు సమాచారం. మరోవైపు మీడియాలో వస్తున్న పలురకాల విమర్శనాత్మక కథనాలపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బాబా భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, బాబా ఆరోగ్యవంతునిగా తిరిగిరావాలని ఆ భగవంతుని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. సమాజానికి బాబాచేసిన మేలు గురించి ప్రపంచానికి చాటిచెప్పాలని అంతే తప్ప బాబా గురించి గాని, ఆయన ట్రస్ట్‌ మీదగాని అభాండాలు వేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
రెడ్‌ అలర్ట్‌...
బాబా ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో పుట్టపర్తిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం కూడా నిషేధాజ్ఞలు కొనసాగాయి. సత్యసాయి ఆస్పత్రి, ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా ఉండేందుకు రెండు హై పవర్‌ జనరేటర్లను రప్పించారు. విపత్కర పరిస్థితి ఏర్పడితే ఆస్పత్రి లోపలి దృశ్యాలను బయట ప్రపంచానికి తెలియజేసేందుకు డిస్‌ప్లే స్క్రీన్‌లను తెప్పించి కొత్తచెరువు మండల కార్యాలయం వద్ద ఉంచారు. మరోవైపు పుట్టపర్తికి విఐపిల తాకిడి అధికంకావడంతో ప్రోటోకాల్‌కోసం జిల్లాలోని పలువురు మండల తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌లను రప్పించారు. ఎటువంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విఐపిల కాన్వాయ్‌కు వాహనాలను సిద్ధంగా ఉంచారు. జిల్లా కలెక్టర్‌ జనార్దరెడ్డి పుట్టపర్తిలోనే మకాంవేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తరలివస్తున్న భక్తజనం
సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందన్న వార్తల నేపథ్యంలో పుట్టపర్తికి భక్తులు ప్రవాహంలా తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా నుండేకాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ తదితర పలు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు బస్సులు, రైళ్లు, స్వంతవాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. దీంతో పుట్టపర్తిలోని లాడ్జీలన్నీ నిండిపోయాయి. ప్రశాంతి నిలయంలోని వసతి గృహాలు కూడా భక్తులతో నిండి ఉన్నాయి. చాలా మందికి బసచేయడానికి అవకాశం లభించక తిరిగవెళుతున్నారు. బాబా సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగివస్తారని, తమకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందన్నది వారి ప్రగాఢ నమ్మకం. బాబా ఆరోగ్యం కోసం పుట్టపర్తి అంతటా పూజలు, ప్రార్థనలు, భజనలు చేస్తున్నారు.

సానుకూల దృక్పథం యువజనాభ్యుదయానికి మూలం


సానుకూల దృక్పథం యువజనాభ్యుదయానికి మూలం ఏశ ప్రగతి అయినా, ఆ దేశంలోని యువకుల ప్రతిభా సామర్ధ్యాలు, శక్తియుక్తులపైనే ఆధార పడి ఉంటుందంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ తరచు చేసే ప్రకటనలు మన కన్నా విదేశీయులనే ఎక్కువ ప్రభావితం చేస్తున్నా యేమోననిపిస్తోంది.యువశక్తిని సద్వినియోగం చేసుకోవడానికి పొజటివ్‌ యూత్‌ డవలెప్‌ మెంట్‌ (పివైడి) పేరిట వివిధ రంగాల్లో యు వతను ప్రోత్సహించే కార్యక్రమం అమెరికాతో సహా వివిధ దేశాల్లో ఇప్పుడు అమలు జేస్తు న్నారు. యువకుల మనోభావాలను గ్రహించి కట్టలు తెగిన ప్రవాహం వంటి వారి శక్తి సామర్ధ్యాలను ఏ విధంగా సమాజ కల్యాణా నికి ఉపయోగించుకోవాలో లోతైన అధ్యయనం చేసిన అనంతరం వివిధ కార్య క్రమాలను రూపొందిస్తున్నారు. విధాన నిర్ణ యాల్లోనూ, కొత్త విషయాలను కనుగొనడం లోనూ యువకులకు ప్రమేయం కల్పించడం జరుగుతోంది. ఈ విషయంలో భారతీయు లకు ఉన్న అంకితభావాన్నీ, పని మీద ఉండే శ్రద్ధాసక్తులను గ్రహించడం వల్లనే అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన ప్రభుత్వ యంత్రాం గంలో ప్రవాస భారతీయులు పెక్కు మందికి కీలకమైన పదవులను ఇచ్చారు. అమెరికాలో ఆరోగ్య, మానవ వనరుల మంత్రిత్వ శాఖలు యువజనాభ్యుదాయనికి సానుకూల వైఖరులను అనుసరిస్తున్నాయి. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే యువకుల్లో నిరాశానిస్పృహలు ఏర్పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా, వారికి తీరిక లేకుండా చేయడం కోసం వివిధ రంగాల్లో వారికి శిక్షణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగా వకాశాలు లభించేట్టు చేయడం, అందుకు తగిన రీతిలో వారికి సలహాలూ, సూచనలు ఇవ్వడం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


యువత సాధికారత
యువ సాధికారతకి ఇప్పుడు అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. తరాల మధ్య అంతరం లేకుండా చేయడానికి పాలనా వ్యవహారాల్లోనూ అనుభవజ్ఞులతో పాటు కొత్త రక్తానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి.సమస్యల పరిష్కారంలో యువత ఆలోచనలూ,అభిప్రాయాలను పంచుకోవడం, వాటికి మెరుగులు దిద్ది పాలనా వ్యవహారాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్నీ, చిత్తస్థయిర్యాన్నీ పెంపొందించడం వంటి కార్యక్రమాలను అప్పుడే వివిధ దేశాలు అమలులో పెట్టాయి. సాధారణ విద్యలోనే కాక, సాంకేతిక, వృత్తి విద్యల్లోనూ,ఇతర ఆధునిక శాస్త్ర,సాంకేతిక రంగాల్లో యువత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఆయా రంగాలలో వారు నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కామన్వెల్త్‌లోని 53 దేశాలు 2007 నుంచి 2015 వరకూ కామన్వెల్త్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యువ సాధికారత అంటే ఆయా రంగాల్లో యువకులు అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నీ, దన్నునూ ఇవ్వడం, యువత ఆలోచనలకూ, అభిప్రాయాలకూ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి. యువకులు తమ హక్కుల గురించే కాక, సమాజం పట్ల తమకు గల బాధ్యతలను గురించి తెలియజెప్పడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా వారిని తీర్చి దిద్దే కార్యక్రమాలను ఈ కార్యాచరణలో పొందుపర్చారు. అలాగే, వివిధ అంశాలకు సంబంధించి సవాళ్ళను ఎదుర్కొనేందుకు
యువతను సన్నద్ధం చేయడం కూడా ఈ ప్రణాళికలోని ముఖ్యాంశం. యువకుల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించడం, హక్కులతో పాటు బాధ్యతలను మరవ రాదని వారికి తెలియజెప్పడం, అట్టడుగు స్థాయి నుంచి యువకులను సమీకరించి వారికి ఏయే రంగాల్లో ఆసక్తి ఉందో గ్రహించి ఆయా రంగాల్లో ప్రోత్సహించడం ఈ కార్యాచరణ ప్రణాళికలో చేర్చడం జరిగింది. చైనా, యూ రప్‌,అమెరికా, తదితర దేశాల్లో యువజన సంస్థలు ప్రణాళికా బద్దంగా పని చేస్తున్నాయి. మానవ హక్కుల గురించి యువతకు సుబోధకం చేసేందుకు జర్మనీలో 2011లోనే యూత్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వ ర్యంలో విద్యార్దినీ విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు.బాల్యం నుంచే మానవ హక్కులపై అవగాహన పెంచేందుకు


చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొన్నది. అలాగే, వక్తృత్వ పటిమను పెంపొందించేందుకు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రాపంచిక, ప్రాదేశిక అంశాలపై అవగాహన పెంచడానికి కంప్యూటర్లు, ఇంటర్నెట్‌లు ఇప్పుడు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. పదవ తరగతి లోపు విద్యార్ధులు కూడా ఇంటర్నెట్‌లో వివిధ సైట్‌లు చూడటానికి అలవాటు పడుతున్నారు. గతంలో మాదిరిగా తమ తలలను పుస్తకాల్లో కాకుండా ఇంటర్నెట్‌లో గంటల తరబడి పెడుతున్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామే కానీ, అన్ని రంగాల్లో మాదిరిగా వ్యాపార ధోరణులు ఈ రంగంలోనూ ప్రవేశించడం వల్ల చెడు వైపు యువతను ఆకర్షించేందుకు జరిగే యత్నాలను అరికట్టడం, సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టాలను కట్టుదిట్టంగా అమలు జేయడం ప్రభుత్వాల బాధ్యత. అభివృద్ది, అవాంఛనీయ ధోరణులు నాణానికి రెండు పార్శ్వాలుగా ఎప్పుడూ ఉంటాయి. మంచి వైపు మాత్రమే మన పిల్లలను నడిపించాలి. అందుకు తగిన విధంగా విద్యా, శిక్షణ విధానాలు ఉండాలి. సాంకేతికాభివృద్ధి సమాజకల్యాణానికి తోడ్పడినప్పుడే అది సార్థకమైనట్టు.

అక్షయ తృతీయ సందడి మొదలు


మే 6న ఆక్షయ తృతీయ. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందన్నది అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకుని అంతంతమాత్రంగా ఉన్న బంగారం అమ్మకాలను పెంచుకోవాలని ఆభరణాల తయారీదారులు, వ్యాపారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు పర్వదినానికి మూడు వారాల ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు.
ధరలు అధికమైనా సెంటిమెంట్‌పై వర్తకుల ఆశలు
రికార్డు స్థాయి అమ్మకాలు సాధ్యమేనంటున్న నిపుణులు
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు మంచి ఊపు మీద ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో 16,900 నుంచి 17,100 రూపాయల మధ్య ఉన్న 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 21 వేల రూపాయలను దాటి ఆల్‌ టైం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. భవిష్యత్‌లో బంగారం ధరలు మరింతగా పెరగనున్నాయని, అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పుడు కొనిపెట్టుకున్నా మంచిదని విశ్లేషకులు సూచిస్తుండడంతో ఈ ఏటి అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డు స్థాయిలను దాటవచ్చని అంచనా. బంగారం కొనుగోలుకు అత్యంత శుభదినంగా పరిగణిస్తున్న ఈ పర్వదినం రోజున ప్రజలను జ్యువెలరీ దుకాణాలవైపు నడిపించేందుకు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రత్యేక ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించింది.
డాలర్‌తో రూపాయి మారకపు విలువ గణనీయంగా మారుతున్న కారణంగా బంగారం ధరలు 35 శాతం వరకూ పెరగవచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ గత సంవత్సరం వేసిన అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 21,500 నుంచి 21,700 రూపాయల మధ్య ఉన్న 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర వచ్చే సంవత్సరం ఆక్షయ తృతీయ నాటికి 25 వేల రూపాయలను అధిగమిస్తుందని డబ్ల్యుజిసి అంచనా వేసింది. ఒక్క వివాహాల సీజన్‌లో మినహా నిన్నమొన్నటి వరకూ స్తబ్దుగా వున్న బంగారం అమ్మకాలు మే 6 తరువాత ఊపందుకుంటాయని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 1400 డాలర్లను దాటి పయనిస్తున్న ఔన్సు బంగారం ధర ఈ సంవత్సరమే 1500 డాలర్లకు చేరవచ్చని అంచనా. అదే జరిగితే మన దేశంలో డాలర్‌తో మారకపు విలువలో ఒడిదుడుకుల కారణంగా 10 గ్రాముల బంగారం ధర 24 వేల రూపాయల వరకూ చేరే అవకాశాలున్నాయి. దీనికితోడు భారతీయ గృహిణుల నుంచి బంగారం కొనుగోలుకు వస్తున్న డిమాండ్‌ మరింతగా పెరగవచ్చని డబ్ల్యుజిసి అభిప్రాయపడింది.
గత కొన్ని సంవత్సరాలుగా బంగారంపై పెట్టే పెట్టుబడులు కూడా సంవత్సరానికి కనీసం 20 నుంచి 25 శాతం వరకూ రాబడులను ఇస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో సగటున సంవత్సరానికి 26 శాతం ధరలు పెరిగాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008లో కూడా గోల్డ్‌ రేట్‌ 17 శాతం పెరిగింది. 2009లో సైతం బంగారం ధరలు పెరుగుతూనే వచ్చాయి. ఒక దశలో 18 వేల రూపాయల రికార్డు స్థాయిని దాటిన బంగారం ధర కెరెక్షన్‌ దిశగా పయనించినప్పటికీ, మరోసారి అదే స్థాయికి చేరింది. గ్రీకు మాంద్యం ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తడి కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బులియన్‌ అందరి కళ్ళనూ ఆకర్షిస్తోంది.
ఇదిలావుండగా, ఆక్షయ తృతీయ రోజున అమ్మకాలను పెంచుకునేందుకు ప్రముఖ రిటైల్‌ కంపెనీలు, ఆభరణాల తయారీ దారులు పెద్దఎత్తున డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారు. పర్వదినం రోజున రద్దీని తట్టుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముందుగానే ఆభరణాలు ఎంచుకుని డబ్బు చెల్లించి 6న వచ్చి డెలివరీ తీసుకోవాలని సూచిస్తున్నారు. తమ షోరూంల నుంచి కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 25 శాతం వరకూ మేకింగ్‌ చార్జీలను తగ్గిస్తున్నామని, వజ్రాభరణాలపై 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఆక్షయ తృతీయ కస్టమర్ల కోసం ఎన్నో డిజైన్లను సిద్ధం చేశామని కొన్ని సంస్థలు, చెన్నై కేంద్రంగా హైదరాబాద్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న సంస్థలు మార్కెట్‌ రేటు కన్నా గ్రాముకు 100 రూపాయల వరకూ తక్కువ ధరకు ఆభరణాలు విక్రయిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ముందుగా బుక్‌ చేసుకుంటే ఆక్షయ తృతీయ రోజున మేళతాళాలతో ఇంటికి వచ్చి మరీ బంగారాన్ని డెలివరీ చేస్తామని ప్రకటించాయి. ఏదిఏమైనా బంగారానికి డిమాండ్‌ ఎల్లప్పుడూ ఉండే భారత్‌లో ఆభరణాల తయారీ సంస్థలు ఆక్షయ తృతీయను ఎంతమేరకు ఉపయోగించుకుని లబ్ది పొందుతాయన్నది మరో మూడు వారాల్లో తెలుస్తుంది.
- శ్రీనివాసకుమార్‌ మామిళ్ళపల్లి


పెరిగినా, తగ్గినా లాభం మీకే..!
పర్వదినం రోజున ఆఖరి సమయంలో రద్దీలో ఇబ్బందులు పడే వారికి ఆకర్షణీయమైన పథకాలు జ్యూయెలర్స్‌ ప్రకటించాయి. బుక్‌ చేసుకున్న రోజున ఉన్న బంగారం ధరకన్నా అక్షయ తృతీయ రోజు ధర తగ్గితే ఆ తేడా మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ధరలు పెరిగితే అదనపు సొమ్ము చెల్లించనక్కర్లేదని తెలియజేస్తున్నాయి. ఇదేదో బాగుంది కదూ..!

మోడీ 'మతోన్మాదానికి'మరో రుజువు!


గాంధీ పుట్టిన గుజరాత్‌లో మత ఘర్షణలు చోటు చేసుకుని తొమ్మిదేళ్ళు దాటినా అవి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పీడకలల్లా వెంటాడుతున్నాయి. కేంద్రాన్నీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలనూ కుదిపేస్తున్న అవినీతిని అదుపు చేయగలిగిన పాలకునిగా, గుజరాత్‌ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న మోడీని ఆనాటి ఘర్షణలు ఇప్పటికీ వెంటాడటం దురదృష్టకరమే. గుజరాత్‌ అల్లర్లలో మోడీకి ప్రమేయం ఉందని గతంలో శ్రీకుమార్‌ వంటి పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారాన్ని తలదన్నే రీతిలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజీవ భట్‌ శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ని దాఖలు చేశారు. ఆనాటి అల్లర్ల వెనుక మోడీకి ప్రమేయం ఉందని ఆ అఫిడవిట్‌లో సంజీవ భట్‌ పేర్కొన్నారు. ఆనాటి అల్లర్లపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మీద నమ్మకం లేనందున వాస్తవాలను తెలియజేసేందుకు ఆయన ఈనెల 14వ తేదీన ఈ అఫిడవిట్‌ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఇప్పటికీ ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న తాను ఇలాంటి సున్నితమైన అంశాలను బహిరంగంగా మాట్లాడటం సబబు కానందున అఫిడవిట్‌ దాఖలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల దగ్ధం సంఘటనకు ప్రతీకారంగా గుజరాత్‌ అంతటా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది ప్రజలు ఊచకోతకు గురి అయ్యారు. ఆనాటి సంఘటనలు తలుచుకుంటేనే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే అంత తీవ్రమైనవని, తాను ప్రభుత్వ సర్వీసులో ఉన్నందున ఆనాటి సంఘటనల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేసానని ఆయన చెప్పారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన మోడీ నిర్వహించిన ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశానికి సంజయ్‌ భట్‌ హాజరయ్యారు. గోద్రా సంఘటనపై చెలరేగిన ప్రతీకార జ్వాలలను చల్లార్చవలసిన బాధ్యత ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీపై ఉంది. అయితే, ఆనాటి సమావేశంలో మోడీ చేసిన ప్రసంగం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని భట్‌ పేర్కొన్నారు. ఆగ్రహంతో ఉన్న హిందువులను అడ్డుకోవద్దనీ, ముస్లింలకు తగిన గుణపాఠం చెప్పనివ్వండి అని మోడీ పోలీసు అధికారులను ఆదేశించినట్టు భట్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. మోడీ మీద మచ్చ పడేట్టు చేసింది ఇదే. మోడీ బిజెపి నాయకుడైనప్పటికీ, ఆయనపై ఆనాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆగ్రహం వ్యక్తం చేసి తన నిష్పాక్షికతను రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా మోడీ రాజధర్మాన్ని పాటించలేదంటూ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్య అప్పట్లో అధికార బిజెపిలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అదే వ్యాఖ్య మరొకరెవరో చేసి ఉంటే ఎవరూ పట్టించుకుని ఉండేవారు కారు. వాజ్‌పేయి బిజెపిలో తిరుగు లేని నాయకుడుగా ఉన్నందున ఆయనకు ఎవరూ ఎదురు చెప్పలేదు కానీ,పార్టీలో మాత్రం కలకలం రేపింది. ఆ తరువాత పార్టీ వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వాజ్‌పేయి అంతటి నాయకుడు మోడీని ప్రశంసించవలసి వచ్చింది. మోడీ మీద వెల్లువెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం అదే వాజ్‌పేయి చేత కమలనాథులు బలవంతంగా ఆ ప్రకటన చేయించారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి వివిధ కేసుల దర్యాప్తును తూతూ మంత్రంగా జరిపించి నిందితులను వదిలేశారన్న ఆరోపణ కూడ మోడీ మీద వచ్చాయి. ఇప్పుడు సంజీవ భట్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నవి కొత్త విషయాలు కాకపోయినా, పాత గాయాన్ని మరోసారి రేపేరీతిలో ఉంది ఆ అఫిడవిట్‌. ఈ సంఘటనలు జరిగిన తరువాత గుజరాత్‌లో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి, రెండు సార్లూ కూడా మోడీ నేతృత్వంలోని బిజెపియే తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే, మోడీలోని మత చాందసుణ్ణి వామపక్షాల వారూ, లౌకిక ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికీ చూస్తుండగా, రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయన పాలనా దక్షతనూ, రాష్టాభివృద్ధికి ఆయన సేవలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే, ఆయన నాయకత్వం పట్ల పదే పదే తమ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.'వైబ్రంట్‌ గుజరాత్‌' పేరిట మోడీ ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో రెండు లక్షల కోట్ల రూపాయిల మేరకు పెట్టుబడులను రాష్ట్రానికి సంపాదించగలిగారు. ఇది సామాన్యమైన విషయం కాదు.
అంతేకాక, గుజరాత్‌లో అవినీతి అసలు లేదనడం అసత్యమవుతుంది కానీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల మాట అటుంచి బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటి కన్నా గుజరాత్‌లో తక్కువ అవినీతి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.కృష్ణా గోదావరి బేసిన్‌లో చమురు అన్వేషణకు గుజరాత్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చొరవ తీసుకుని వచ్చి అంచనాలకు మించిన లాభాలను మూటగట్టుకుని వెళ్ళడానికి మోడీ చూపిన చొరవే ప్రధాన కారణం. అందుకే, మోడీని దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ బిజెపి అగ్రనాయకుడు అద్వానీ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే, సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో కూడా మోడీ మీద మచ్చ పడింది. మోడీని లౌకిక వాద పార్టీలు, వామపక్షాలే కాక, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కూడా దూరంగా ఉంచుతున్నాయి. గత సంవత్సరం జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీని తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా జనతాదళ్‌(యు) నాయకుడు, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బిజెపి కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు సంజీవ భట్‌ వెల్లడించిన అంశాలు మోడీని మరింత వివాదాస్పదుణ్ణి చేస్తాయి. ఒక వంక పాలనా దక్షునిగా, మరో వంక మత చాందసునిగా మోడీ ఇప్పటికే పేరొందారు, అయితే, ఆయన ఇలాంటి విమర్శలూ, ఆరోపణలనూ ఖాతరు చేయకుండా తన మార్గాన తాను పని చేసుకుని పోతున్నారు. నవ గుజరాత్‌ నిర్మాతగా ఆయన ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సంజీవ భట్‌ చేసిన ఆరోపణల ప్రభావం ఏమేరకు ఉంటుందనేది వేచి చూడవలసిందే.

గేల్‌ విధ్వంసం... బెంగళూరు 'రాయల్‌' గెలుపు


కోల్‌కతా: వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. క్రిస్‌గేల్‌ (102 నాటౌట్‌) విధ్వంసక సెంచరీ సాధించడంతో 172 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు మరో 11 బంతులు మిగిలివుండగానే కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. యూసుఫ్‌ పఠాన్‌ (46), గంభీర్‌ (48), కలిస్‌ (40) పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించారు. కాగా, అజేయ సెంచరీతో బెంగళూరును గెలిపించిన గేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
గేల్‌ విశ్వరూపం...
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌కు ఓపెనర్లు దిల్షాన్‌, గేల్‌ శుభారంభం అందించారు. ప్రారంభంలో దిల్షాన్‌ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మరోవైపు ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గేల్‌ చెలరేగి పోయాడు. తొలి బంతి నుంచే కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన పాత ఫ్రాంచైజీ రైడర్స్‌ కసి తీర్చుకుంటున్నాడా అనే విధంగా గేల్‌ చెలరేగి పోయాడు. దీంతో ఈడెన్‌లో పరుగుల వరద పారింది. ఇద్దరూ పోటీపడి షాట్లు కొట్టడంతో బెంగళూరు స్కోరు 5.3 బంతుల్లోనే 50 దాటింది. తర్వాత గేల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ 29 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇదే క్రమంలో స్కోరును 100 పరుగులు దాటించాడు. మరోవైపు కుదురుగా ఆడిన దిల్షాన్‌ 31 బంతుల్లో 6ఫోర్లతో 38 పరుగులు చేసి బాలాజీ బౌలింగ్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 123 పరుగు తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి అండతో గేల్‌ తన ప్రతాపాన్ని కొనసాగించాడు. ఇద్దరూ వేగంగా ఆడుతూ జట్టును లక్ష్యం వైపు తీసుకెళ్లారు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ 50 బంతుల్లోనే 10ఫోర్లు, 7సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లి కూడా చెలరేగి ఆడాడు. 23 బంతుల్లోనే 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. గేల్‌ (102) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు అబేధ్యంగా 52 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరుకు టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. కాగా, కోల్‌కతాకు ఇది వరుసగా రెండో ఓటమి. కొచ్చితో జరిగిన మ్యాచ్‌లోనూ గంభీర్‌ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే.
శుభారంభం...
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతాకు ఓపెనర్లు కలిస్‌, హడిన్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. జహీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే కలిస్‌ 3ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో జట్టుకు 19 పరుగులు లభించాయి. మరోవైపు చెలరేగి ఆడిన హడిన్‌ 11 బంతుల్లోనే 2ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన గంభీర్‌ చెలరేగి ఆడాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన గంభీర్‌ 36 బంతుల్లోనే 6ఫోర్లతో 48 పరుగులు సాధించాడు. సమన్వయంతో ఆడిన కలిస్‌ 42 బంతుల్లో 4ఫోర్లతో 40 పరుగులు చేశాడు. చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. చెలరేగి ఆడిన పఠాన్‌ 24 బంతుల్లో 3సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 46 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
స్కోరుబోర్డు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌: కలిస్‌ (సి) క్రిస్‌ గేల్‌ (బి) వెటోరీ 40, బ్రాడ్‌ హాడిన్‌ (సి) కోహ్లి (బి) సయ్యద్‌ మహ్మద్‌ 18, గౌతమ్‌ గంభీర్‌ (సి) దిల్షాన్‌ (బి) అరవింద్‌ 48, యూసుఫ్‌ పఠాన్‌ (సి) కోహ్లి (బి) అరవింద్‌ 46, ఇయాన్‌ మోర్గన్‌ (రనౌట్‌) 6, సౌరబ్‌ తివారి (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు.
వికెట్ల పతనం: 1-44, 2-102, 3-139, 4-169, 5-171.
బౌలింగ్‌: జహీర్‌ ఖాన్‌ 4-0-53-0, అరవింద్‌ 3-0-37-2, సయ్యద్‌ మహ్మద్‌ 4-0-20-1, దిల్షాన్‌ 2-0-15-0, విరాట్‌ కోహ్లి 1-0-9-0, డానియల్‌ వెటోరీ 4-0-28-1, క్రిస్‌ గేల్‌ 2-0-9-0.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దిల్షాన్‌ (బి) లక్ష్మిపతి బాలాజీ 38, క్రిస్‌ గేల్‌ (నాటౌట్‌) 102, విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 18.1 ఓవర్లలో 175/1.
వికెట్ల పతనం: 1-123.
బౌలింగ్‌: యూసుఫ్‌ పఠాన్‌ 3-0-25-0, లక్ష్మిపతి బాలాజీ 4-0-43-1, ఉనాద్కత్‌ 3-0-24-0, సాకిబ్‌ అల్‌ హసన్‌ 2.1-0-29-0, భాటియా 3-0-28-0, సౌరబ్‌ తివారి 1-0-14-0, ఇక్బాల్‌ అబ్దుల్లా 2-0-12-0.

ఒబామా, మెస్సీలకంటే పలుకుబడి గల ధోనీ


న్యూయార్క్‌ : టైమ్‌ మాగజైన్‌ 2010 సంవత్సరానికి రూపొందించిన ప్రపంచంలో అత్యంత పలుకుబడి గల 100 మంది ప్రముఖుల జాబితాలో భారత క్రికెట్‌ కెప్టన్‌ మహేంద్ర సింగ్‌ దోనీ 52వ స్థానంలో నిలిచి అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా, ప్రపంచ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియొనెల్‌ మెస్సీ కంటేకూడా ముందున్నారు. ఒబామా 86వ స్థానంలోనూ, మెస్సీ 87వ స్థానంలోను నిలిచారు. జాబితాలో ప్రథమ స్థానాన్ని గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ వేల్‌ ఘోనిమ్‌ ఆక్రమించారు. ఈ జిప్టు విప్లవంలో ఘోనిమ్‌ అధికార ప్రతినిధిగా ఉన్నారు. జాబితాలో క్రీడారంగానికి చెందిన ఏకైక భారతీయుడు ధోనీకాగా, ఇతర రంగాలకు చెందిన నలుగురు భారతీయులకు కూడా జాబితాలో స్థానం లభించింది. ''టైటాన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ'' గా ముఖేష్‌ అంబానీకి జాబితాలో 61వ స్థానం, 'బ్రెయిన్‌ మేపర్‌' గా వి.ఎస్‌.రామచంద్రన్‌కు 79వ స్థానం, 'ఫిలాంత్రఫిస్ట్‌' గా అజీమ్‌ ప్రేమ్‌జీకి 88వ స్థానం, 'ఛేంజ్‌ ఏజెంట్‌' గా అరుణా రాయ్‌కి జాబితాలో 89వ స్థానం లభించాయి. ధోనీని ''కెప్టెన్‌ ఆఫ్‌ ఫాంటాస్టిక్‌'' గా టైమ్‌ మాగజైన్‌ అభివర్ణించింది. టెండూల్కర్‌ తరువాత టైమ్‌ మాగజైన్‌ 100 మంది ప్రపంచ పలుకుబడిగల వ్యక్తుల జాబితాలో మంచి ర్యాంకు పొందిన క్రీడాకారులలో ధోనీ రెండవవారు.
జాబితాలో స్థానం దక్కిన ఇతర ప్రముఖులలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ (43వ స్థానం దక్కించుకుని ఒబామాకంటేకూడా ముందున్నారు), ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌, (6వ స్థానం), వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అస్సాంజె(9వ స్థానం) ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా గుడ్‌ఫ్రెడే ప్రార్ధనలు


న్యూఢిల్లి : జీసెక్రీస్ట్‌ ను శిలువ వేయడాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలూ, ఊరేగింపులూ, ఐహిక సుఖాలను త్యజించడానికి చిహ్నంగా ఉపవాసాలతో ఘనంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు జరిగాయి. కొవ్వొత్తులను చేతితో పట్టుకిని, వందలూ, వేలాది మంది క్రిస్టియన్‌లు వివిధ ప్రాంతాలలో చెక్క క్రాస్‌లను ధరించి భక్తి శ్రద్ధలతో ఊరేగింపులు జరిపారు. జెరూసలేం పాత నగరంలో వేల సంఖ్యలో క్రిష్టియన్లు ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇక్కడే రోమన్లు క్రీస్త్‌కు శిలువ వేశారు. లాటిన్‌ పాట్రియార్క్‌ ఫౌద్‌ తవల్‌ నాయకత్వంలో కాథలిక్‌ చర్చిల ప్రతినిధులు జరూసలేంలో ఉదయపు ఊరేగింపు నిర్వహించారు. భారత దేశంలోకూడా దేశ వ్యాప్తంగా ఘనంగా గుడ్‌ ఫ్రైడే వూరేగింపులూ ప్రత్యేక ప్రార్థనలూ జరిగాయి. కేరళ క్రిస్టియన్లు రోజంతా ప్రార్థనలు జరిపారు. పట్టణాలూ, పల్లెలలో సైతం ఊరేగింపులు సాగాయి. నాగాలాండ్‌లోకూడా కేథలిక్కులు పెద్ద ఎత్తున కోహిమాలో గుడ్‌ ఫ్రైడే వేడుకలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో “గుడ్‌ఫ్రైడే‘
హైదరాబాద్‌,ఆంధ్రప్రభ ప్రతినిధి : క్రైస్తవుల ఆరాధ్యదైవమైన యేసుక్రీస్తు (జీసస్‌ క్రైస్ట్‌) చనిపోయిన రోజైన “గుడ్‌ఫ్రైడే‘ను శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా యేసుక్రీస్తు సిలువపై పలికిన యేడు మాటలను ధ్యానించారు. కేథలిక్‌ చర్చ్‌లలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని నాటకాలుగా ప్రదర్శించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలోని కేథలిక్‌, బాప్టిస్ట్‌, మెథడిస్ట్‌, మెన్నోనైట్‌, సిఎస్‌ఐ తదితర చర్చిలలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్‌లోని సిఎస్‌ఐ చర్చితో పాటు విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌, కర్నూలు నగరాలలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. లోకంలోని పాపాలను కడిగి వేసేందుకే జీసస్‌ క్రైస్ట్‌ సిలువపై చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్లారని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. ఆయన మరణంతోనే పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తం అనేవి మానవ జీవితాలకు ఉన్నాయని అంటారు. 2 వేల సంవత్సరాల క్రితం రోమన్‌ సామ్రాజ్యంలో పేదలు, అణచివేయబడిన ప్రజల పక్షాన తన గొంతును విప్పి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు యేసుక్రీస్తు ప్రయత్నించారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి విస్తుపోయిన రోమన్‌ పాలకులు, ఆయన అలాగే ప్రజల్లో తిరిగితే తమ ప్రభుత్వాలు కూలిపోతాయనే భయంతో అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో చిత్రహింసలు పెట్టి సిలువ వేసి చంపేస్తారు. శుక్రవారం నాడు ఆయన చనిపోయి తిరిగి ఆదివారం పరలోకం వెళతారు. ఆయన చనిపోయి పునరుత్థానుడవటంతో తమ పాపాలకు ప్రాయశ్చిత్తం లభించిందని క్రైస్తవులు నమ్ముతారు. అందువల్ల ఆయన చనిపోయిన దినాన్ని “గుడ్‌ఫ్రైడే‘గా ఆచరిస్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెల మూడవ శుక్రవారాన్ని క్రైస్తవులు, యూదులు “గుడ్‌ఫ్రైడే‘గా ఆచరిస్తారు.

విషాద సమయంలో విష ప్రచారమా?


  • ట్రస్ట్‌ వ్యహారాలపై భక్తులను బాధిస్తున్న మీడియా కథనాలు 
  • బాబాకే నేరుగా విరాళాలు... చెక పవర్‌ ఆయనదే
  • కార్యక్రమాలన్నీ పారదర్శకమే, సేవా సంస్థలన్నీ బాబా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే 
  • సహాయం కోసం ట్రస్ట్‌ సభ్యులుగా కొందరి నియామకం
  • బాబా స్థానంలో ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహిస్తే భక్తుల విశ్వాసం సడలే అవకాశం లేదు
హైదరాబాద్‌: కోట్లాది మంది భక్తులు అవతార పురుషుడిగా భావిస్తున్న సత్యసాయి బాబా అంపశయ్యపై ఉంటే ఆయన తర్వాత సత్యసాయి ట్రస్ట్‌ నిర్వహణా బాధ్యతల్ని ఎవరు చేపట్టాలన్న అంశంపై విస్తృతంగా మీడియాలో చర్చలు జరగడం బాబా భక్తుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. డాక్టర్లు గంటకో రకంగా సత్యసాయి ఆరోగ్యంపై ప్రకటనలిస్తున్నప్పటికీ భక్తులంతా సాయిబాబా తప్పకుండా కోలుకుంటారని, తిరిగి తమకు దర్శనిమిస్తారని, తమనాశీర్వదిస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఏదో అద్భుతం జరిగి తీరుతుందని నమ్ముతున్నారు. కానీ బాబా సజీవుడిగా ఉండగానే ఆయన అనంతరం జరగాల్సిన కార్యక్రమాలపై బాధ్యత కలిగిన మీడియా, కొంతమంది వ్యక్తులు చేపట్టిన విషప్రచారం వీరందరినీ బాబా ఆరోగ్య స్థితికంటే కూడా ఎక్కువగా బాధిస్తోంది.
సత్యసాయి సేవా ట్రస్ట్‌ అధ్యక్షుడిగా సాక్షాత్తు సాయిబాబాయే ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ట్రస్ట్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రస్ట్‌కు సంబంధించిన విరాళాలన్నీ ఆయనకే నేరుగా వస్తున్నాయి. ప్రతిపైసాను ఆయనే ఖర్చు చేస్తూవచ్చారు. చెక్కులపై సంతకాలు పెట్టే అధికారం ఆయనొక్కరికే ఉంది. ట్రస్ట్‌లో బాబా తర్వాతెవరు ? అనే చర్చకే తావులేదు. బాబాను చూసే భక్తులు విరాళాలిచ్చారు. ట్రస్ట్‌ నిర్వహిస్తున్న కళాశాలలు, వైద్యశాలలు, మంచినీటి పథకాలు, ఇతర సేవా సంస్థలన్నీ బాబా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే. తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు, వాటిని ఆచరణలో పెట్టేందుకే బాబా కొంతమంది సహాయకుల్ని ట్రస్ట్‌ సభ్యుల పేరిట నియమించుకున్నారు. బాబా పట్ల భక్తులకున్న విశ్వాసం ఈ ప్రపంచంలో మరెవరిపట్ల వారికుండదు. బాబా ఆధ్వర్యంలో తమ విరాళాలు సద్వినియోగమౌతాయని, బాబా ఆశయాలకనుగుణంగా వాటిని వ్యయం చేస్తారన్న విశ్వాసంతోనే ఇప్పటికీ విరాళాలు వెల్లువెత్తున్నాయి. బాబా స్థానంలో మరెవరున్నా విరాళాల వెల్లువ ముందుకుసాగదు. కేవలం ప్రభుత్వ అజమాయిషీలో ట్రస్ట్‌ కొనసాగితేనే దీనికి విశ్వసనీయత ఉంటుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణంతా పాలకమండలి సభ్యు లే చేపట్టినప్పటికీ పూర్తి పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వానికే ఉంటు ంది. పాలకమండలి సభ్యులు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రభుత్వ ఆమోదం మేరకే అమలౌతున్నాయి. వారు చేపట్టే ఖర్చులకు పరోక్షంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది. అందుకే టిటిడి పట్ల ప్రజల్లో నమ్మకం సడలడంలేదు. రోజూ కోట్ల రూపాయలు టిటిడికి విరాళాలుగా అందుతున్నాయి.

ప్ర'శాంతి'నిలయంలో కొనసాగుతున్న భజనలు


పుట్టపర్తి: అది పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం. పేరుకు తగినట్లే ప్రపంచ శాంతికి అంకితమైన భగవాన్‌ సత్యసాయిబాబా మనోన్మందిరం. గత నాలుగైదు దశాబ్దాలుగా నిత్యం భజనలు, పూజలతో సత్యసాయి భక్తులతో కళకళలాడుతోంది. బాబా పుట్టపర్తిలో ఉన్నా, పర్యటనలకు వెళ్లినా అక్కడి కార్యక్రమాల్లో ఏ మాత్రం తేడా ఉండదు. ప్రస్తుతం బాబా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ప్రశాంతి నిలయంలోగానీ, బాబా ఆధ్యర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థలు, వైద్యసేవలకుగాని ఎలాంటి విఘాతం కలుగలేదు. బాబా ఆరోగ్యవంతుడై తిరిగివస్తారన్న ప్రగాఢ నమ్మకంతో అక్కడి సిబ్బంది, భక్తులు, సేవాదళ్‌ కార్యకర్తలు తమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అనుదినం బాబా భక్తులకు దర్శనమిచ్చే సాయి కుల్వంత్‌ హాలులో ఉదయం, సాయంత్రం భజన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రశాంతి నిలయంలోని లైబ్రరీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌, క్యాంటీన్లు ఎప్పటిలాగే పనిచేస్తున్నాయి. ప్రశాంతి నిలయానికి భక్తుల రాకపోకలు కూడా అధికంగానే ఉన్నాయి. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో అక్కడ సందడి కనిపించడం లేదు. చైతన్య జ్యోతి మ్యూజియం, నక్షత్రశాల, ఇండోర్‌ స్టేడియంలలో శుక్రవారం సందర్శకులను అనుమతించలేదు.
గత రెండు మూడు రోజులుగా పుట్టపర్తిలో పోలీసుల ఆంక్షలు అధికం కావడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. పట్టణంలో వ్యాపార సంస్థలు, లాడ్జిలు, హోటళ్లు పోలీసుల ఆంక్షలతో మూతపడడంతో భక్తులతోపాటు స్థానికులు ఇబ్బందుల పాలయ్యారు. పుట్టపర్తికి వచ్చే బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పలుచబడింది. ఆర్‌టిసి డిపో కలెక్షన్‌లు పడిపోయాయి. రోజుకు రూ.5 లక్షల కలెక్షన్లు వస్తుండగా బాబా అనారోగ్యానికి గురైన నాటి నుండి రాబడి తగ్గిందని, ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4లక్షలు కలెక్షన్‌ వస్తోందని ఆర్టీసి అధికారులు తెలిపారు.

Saturday, April 16, 2011

వేసవి 'పాట్లు' పై సన్నద్ధం ప్రజావసరాలపై ప్రత్యేక దృష్టి


  • తాగు నీరు, విద్యుత్‌, ఉపాధి కల్పన, వ్యాధుల నివారణకు సత్వర చర్యలు 
  • మేలో ప్రజా పథం, రైతు చైతన్య యాత్రలు 
  • ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్‌
హైదరాబాద్‌: వేసవిలో తాగునీరు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా, వలసల నివారణ, ఉపాధి హామీ పథకం అమలు, అంటువ్యాధుల నియంత్రణకు ముందస్తు ప్రణాళికలతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వేసవిలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు, తాత్కాలిక ప్రత్యామ్నాయ ప్రణాళికలు, నిధుల అవసరాలను ప్రత్యేకంగా చర్చించారు. వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం కొంత వరకు తగ్గినప్పటికీ, రాబోవు పక్షం రోజుల పాటు పంటలకు అవసరమైన మేరకు విద్యుత్‌ సరఫరా చేయడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా అత్యంత ప్రాధాన్యం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
వనరులను గుర్తించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయడం, విద్యుత్‌ శాఖతో సమన్వయం ఏర్పరచుకొని సకాలంలో సక్రమంగా మంచినీటిని సరఫరా చేయడంపై గ్రామీణ మంచినీటి వ్యవస్థ దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామీణ మంచినీటి అవసరాల కోసం రూ. 52 కోట్లు, పట్టణ ప్రాంత మంచినీటి సరఫరా కోసం రూ. 42 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంచినీటి అవసరాల కోసం నిధుల కొరత రానివ్వబోమని తెలిపారు. గ్రామాల్లో వలసలు నివారించాలని ముఖ్యమంత్రి సూచించారు. వేసవిలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే కూలి 30 శాతం అధికం చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాబోవు 65 రోజుల పాటు కూలీలకు పనులు కల్పించడానికి స్థానికంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
రాబోవు మూడు సంవత్సరాల కాలంలో షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన 11 లక్షల ఎకరాల భూములను అభివృద్ధి పర్చడానికి రూ. 5675 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మహాత్మాగాంధీ వనాల పెంపకం పథకం కింద 30 కోట్ల మొక్కలు పెంచే పథకాన్ని పటిష్టంగా అమలు జరపాలని ఆదేశించారు. ప్రజాపధం, రైతు చైతన్య యాత్రల కోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారుల స్థాయిలో కార్యాచరణ ఉండాలని, రచ్చబండలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి అర్హులకు ప్రయోజనం కల్పించవలసి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 572 కోట్లతో చేపట్టిన 1868 శాశ్వత తాగునీటి సరఫరా పథకాలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను
కోరారు. వేసవిలో వచ్చే వ్యాధుల నియంత్రణ, నివారణలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగవలసి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే విధంగా నిరంతర పర్యవేక్షణ, సమీక్ష అవసరమని సూచించారు.
వచ్చే నెల మొదటి వారంలో ప్రజాపధం కార్యక్రమం ఉంటుందని, అది పూర్తి కాగానే రైతు చైతన్య యాత్రలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, ఎన్‌.రఘువీరారెడ్డి, పి. బాలరాజు, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, మహీధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి. ప్రసాద్‌, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ కాన్ఫరెన్‌లో పాల్గొన్నారు.

హ్యాపీ డేస్‌


వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలకు ఒకటే సరదా. అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్ళేవాళ్ళు కొందరైతే, మరికొందరు నగరాలలో స్విమ్మింగ్‌ పూల్స్‌, సమ్మర్‌ క్యాంప్స్‌లో కాలం గడుపుతారు. వేసవి ఎండలు ముదురు తుంటే గ్రామాలలో ముంజికాయ బండ్లు, చెరువుదగ్గర ఆటలు, చెరువులో స్నానాలు ఓ పక్కఅయితే, నగరాలలో ఐస్‌క్రీంలు తినడం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం ఓ రివాజుగా మారింది. ఇక ఎండలకు తాళలేక, ముంజెలు, కొబ్బరి బోండాలు, చెరుకురసం, నిమ్మరసం, మామిడిపళ్ళ రసం మొదలైనవి లాగిస్తుంటారు.
రాను రాను, నగరాలలో సమ్మర్‌ క్యాంప్స్‌ పేరిట సమయం వృధా పోకుండా అనేక సంస్థలు విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు రూపొందించాయి. సమ్మర్‌లో ఏ మాత్రం బోర్‌ కొట్టకుండా వారికి మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయి. హైదరాబాద్‌లోని వివిధ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సరళిని పరిశీలిద్దాం.
బాలవికాస్‌, మల్లికార్జున నగర్‌:
గోపాల్‌ నగర్‌లో నివాసముంటున్న ఉమ ఎస్‌బిఐలో సీనియర్‌ ఉద్యోగిని. ఆమె కేవలం వేసవిలోనే కాక సంవత్సర మంతా సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బాలవికాస్‌ తరగతులను పిల్లలకు నిర్వహిస్తారు. దీనిలో వేద పఠనం, శ్లోకాలు, గీత పంచతంత్ర కథలు ఇత్యాదివి నేర్పుతూ నేటి బాలల్ని రేపటి ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
ట్రెజర్‌ హౌస్‌:
హాస్య కవితలు, పబ్లిక స్పీకింగ్‌, సైంటిఫిక క్రాఫ్ట్‌, యోగా, తరగ తుల ద్వారా మానసిక వికాసానికి, శారీరక వికాసానికి తోడ్పడుతున్నారు.
దివ్య ఇన్‌స్టిట్యూట్‌, కొంపల్లి:
సమ్మర్‌ క్యాంపులో పెయింటింగ్‌, వాటర్‌ కలర్స్‌, డ్రాయింగ్‌, స్కెచింగ్‌ నేర్పిస్తారు. ఏప్రిల్‌ 17 నుండి మే 17 వరకు చిత్రకళలో విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
ఇస్కాన్‌, సికిందరాబాద్‌:
ఇక్కడ పిల్లలకు భగవద్గీత శ్లోకాలను ఎంతో సులభంగా ఆలపించే విధంగా తర్ఫీదునిస్తారు. అంతేకాక వారి మానసిక ఉన్నతికి కాలానికను గుణంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు.
కిట్స్‌ జోన్‌, గాంధీ నగర్‌్‌:
ఇక్కడ డాన్స్‌, మ్యూజిక, క్రాఫ్ట్స్‌, గ్లాస్‌ డిజిటల్‌ పెయింటింగ్‌లో తరగతులను మే 4 నుండి జూన్‌ 3 వరకు నిర్వహించనున్నారు.
ఆల్‌ సైన్స్‌ హైస్కూల్‌, అబిడ్స్‌:
ఇక్కడ ఫుట్‌బాల్‌ తరగతులను 5 సంవత్సరాలనుండి 17 సంవత్స రాల పిల్లలకు ఏప్రిల్‌ 17 నుండి మే 20 వరకు నిర్వహించనున్నారు.
కళానిధి ఇన్‌స్టిట్యూట్‌, మారేడ్‌ పల్లి:
ఇక్కడ గిటార్‌, పియానో, ఫ్లూట్‌, కర్ణాటక సంగీతంను, సాయంకాలం 4 నుండి రాత్రి 9 వరకు నిర్వహించనున్నారు.
మామ్‌ అండ్‌ మి:
హైదరాబాద్‌ నగరంలోని ఆంధ్ర మహిళా సభ 'మామ్‌ అండ్‌ మి' సంస్థ ద్వారా ఏప్రిల్‌ 18 నుండి పిల్లలకు వేదగణితం, తోలుబొమ్మలాట, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, నగల తయారీ, క్రాఫ్ట్‌, చేతివ్రాత, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, కుండపై పెయింటింగ్‌, గ్లాస్‌పెయింటింగ్‌, ఇంగ్లీష్‌ బోధన నేర్పనున్నారని పోగ్రామ్‌ కో- ఆర్డినేటర్‌ స్వర్ణ దుర్గ తెలియజేశారు.
బెంగుళూరు
బెంగుళూరులో చిన్నార చావిడి:
ఈ సంస్థ మే 1నుండి 15 వరకు ఉదయం 9 నుండి సాయంకాలం 4.30 వరకు వాయిస్‌ కల్చర్‌, బాడీ లాంగ్వేజ్‌, పాటలు, డాన్స్‌, డ్రాయింగ్‌, బాలకవుల సమ్మేళనం నిర్వహించనున్నారు.
కిండర్‌ డాన్స్‌:
ఈ సంస్థ 2 సంవత్సరాలనుండి 8 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు ఫిట్‌నెస్‌, డాన్స్‌, జిమ్నాస్టిక్స, బాడీ ఎవేర్‌నెస్‌ తదితర వినూత్న కార్యక్రమాలను రూపొందించారు.
ఐ-లీప్‌ అకాడమి:
ఈ సంస్థ ఏప్రిల్‌ 11 నుండి 16 వరకు పిల్లలకు ప్రకృతిని ఎలా ఆస్వాదించాలో వర్క్‌షాపులను నిర్వహించనున్నారు. మైక్రోస్కోప్‌ ద్వారా ప్రకృతి రహస్యాలను సైన్స్‌తో జోడించి అందజేయనున్నారు.
లాంచ్‌ పాడ్‌:
ఈ సంస్థ 5 సంవత్సరాలనుండి 10 సంవత్సరాల పిల్లలకు ఏప్రిల్‌ 29 వరకు సమ్మర్‌ క్యాంపులను నిర్వహించనున్నది.
జి-లెర్న్‌:
ఈ సంస్థ 3 నుండి 15 సంవత్సరాల పిల్లలకు వాళ్ళ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి రోబో టెక వర్క్‌షాపును నిర్వహించనుంది. దీని కారణంగా విద్యార్థులు గణితంలోనూ, సైన్స్‌లోనూవారి ప్రతిభ మరింత రాణిస్తుంది. వీరికి రోబోకిట్‌ ఇచ్చివారితో రోబోలను తయారుచేయిస్తారు.
జి-స్కూల్‌:
కిడ్‌జీ, మౌంట్‌ లిటరా జి స్కూల్‌తో కలిసి ఫ్రీ స్టెయిల్‌ డాన్స్‌ను నిర్వహించనున్నారు.
లతాస్‌ క్రియేటివిటీ:
పిల్లలకే కాక పెద్దలకు కూడా గిఫ్ట్‌ ప్యాకుల తయారీ, చాకలెేట్ల తయారీ, డెకరేటివ్‌ ప్యాకింగ్‌, క్రిస్టల్‌, గ్లాస్‌ పెయింటింగ్‌, గ్రీటింగ్‌ కార్డ్‌ తయారీ, పాట్‌ డెకరేషన్‌లో తరగతులను నిర్వహించనున్నారు.
గార్డెన్‌ గుషప్స్‌:
నేత, బొమ్మల తయారీ, బ్యాగుల తయారీలో పిల్లలకు తర్ఫీదునిస్తారు.
వేసవి కాలాన్ని వృధా చేయకుండా ప్రతిభకు పదును పెడితే పిల్లలు బాగా రాణిస్తారు. అయితే, చాలా సంస్థలు సమ్మర్‌ క్యాంపులకు రుసుం(ఫీజు) వసూలు చేస్తున్నాయి. ఆ సంస్థలు మధ్యతరగతి, దిగువ తరగతి విద్యార్థులను దృష్టిలో వుంచుకుని ఫీజులు వారికి అందు బాటులో ఉండేటట్లు చూడాలి. వేసవి దాటిందంటే మళ్ళీ స్కూలు ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు ఇబ్బందే! బాలవికాస్‌ లాంటి సంస్థలను మిగతా సంస్థలు ఆదర్శంగా తీసుకొంటే మంచిది. నేడు డాన్స్‌ బేబీ డాన్స్‌ తదితర కార్య క్రమాలు పిల్లలను విశేషంగా ఆకర్షిస్తు న్నాయి. వీటివైపు ప్రధానంగా దృష్టి మళ్ళించకుండా, వారు చదువుల్లో, మానసికంగానూ, శారీరకంగా అభివృద్ధి చెందేందుకు యోగాను ఎంపిక చేసుకో వాలి. విద్యార్థులను సెలవుల్లో ప్రయోజ నాత్మక సమ్మర్‌ క్యాంపులవైపు మళ్ళిస్తే , అవి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లు అవుతుంది.

దిగజారిన ఇన్ఫీ క్యూ-4


ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ క్యూ-4 ఆర్థిక ఫలితాలు అంచనాలను చేరలేకపోయాయి. కనీసం ఆ సంస్థ ముందుగా ప్రకటించిన ఆదాయ లక్ష్యాన్ని సైతం తాకకపోడవంతో దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇన్ఫోసిస్‌ ఈక్విటీ ఒక రోజు సెషన్‌లో భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఒకవైపు సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడి ప్రారంభం కాగానే బిఎస్‌ఇలో ఇన్ఫీ షేర్‌ ప్రైస్‌ 10 శాతం పతనమైంది.
దేశంలోని రెండవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ కన్సాలిడేటెడ్‌ విధానంలో 1,818 కోట్ల రూపాయల నికర లాభాన్ని నాలుగో త్రైమాసికంలో నమోదు చేసింది. గత సంవత్సరం నెట్‌ ప్రాఫిట్‌ 1,779.8 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 2.15 శాతం అధికం. సంస్థ ఆదాయం సైతం 2 శాతపు నామమాత్రపు వృద్ధిని నమోదు చేసి 7,105.6 కోట్ల నుంచి 7,250 కోట్లకు చేరింది. అంతకుముందు సంస్థ నికరలాభం 1.856 కోట్లకు, ఆదాయం 7,447 కోట్లకు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. జనవరి-మార్చి మధ్య కాలంలో ఇబిఐటి మార్జిన్లు సైతం తగ్గి 29 శాతానికి చేరాయి. ఇతర అదాయాలు 65 శాతం పెరిగి 252 కోట్ల నుంచి 415 కోట్లకు చేరాయి. ఇపిఎస్‌ 119.41 రూపాయలుగా నమోదైంది.
ఈ మూడు నెలల కాలంలో 3,041 మంది సంస్థను వీడిపోయారు. ఇదే సమయంలో 45 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని సంస్థ వెల్లడించింది.
పాయ్‌ రాజీనామా
కాగా, ఇన్ఫోసిస్‌ బోర్డుకు మోహన్‌దాస్‌ పాయ్‌ రాజీనామా చేశారు. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్‌ బోర్డుతో అనుబంధం పెంచుకున్న పాయ్‌ ప్రస్తుతం సంస్థలో టాప్‌-2 పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. నందన్‌ నిలేకనితో కలసి ఇన్ఫీ ఫౌండర్‌లలో ఒకరైన పాయ్‌ రాజీనామా అనంతరం అతనితోనే కలసి ప్రతిష్ఠాత్మక ఆధార్‌ ప్రాజెక్టుకు సేవలందించాలని నిర్ణయించుకున్నారు. సాధ్యమైనంత త్వరగా తనను విధుల నుంచి తప్పించాలని శుక్రవారం నాడు పాయ్‌ ఇన్ఫోసిస్‌ బోర్డును కోరారు. జూన్‌ 11న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన సంస్థను వీడవచ్చని సమాచారం.
2011-12 కనీస వృద్ధి 5.5 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వార్షిక వృద్ధి 5.5 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉంటుందని ఇన్ఫోసిస్‌ అంచనా వేసింది. ఇపిఎస్‌ 126.05 నుంచి 128.21 రూపాయల మధ్య ఉంటుందని బోర్డు డైరెక్టర్‌ మోహన్‌ దాస్‌ పాయ్‌ వివరించారు. ఐటి సేవల నిమిత్తం క్లయింట్లు వెచ్చిస్తున్న మొత్తం ఒడిదుడుకులకు లోనవుతోందని, దీనికితోడు మారక ద్రవ్య విలువల్లో మార్పు ఫలితాలపై ప్రభావం చూపుతోందని వివరించారు.
100 కంపెనీలకు సిఇఒలు ఇన్ఫీ ఉద్యోగులే
సమీప భవిష్యత్‌లో కనీసం 100 కంపెనీల్లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లుగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగులను చూడనున్నామని మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు. సంస్థలో 1.3 లక్షల మంది ఉద్యోగులు అత్యంత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దబడ్డారని, భవిష్యత్‌లో వీరిలో నుంచి కనీసం వంద మంది చిన్న, మధ్య తరహా కంపెనీలకు చీఫ్‌లు కానున్నారని ఆయన అన్నారు. కె దినేష్‌ రాజీనామాపై స్పందిస్తూ, ఆరోగ్య కారణాల వల్లే ఆయన సంస్థకు దూరం కావాల్సి వచ్చిందని వివరించారు.

నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ వాట్సన్‌


దుబాయి: అంతర్జాతీయ క్రికెట్‌ (ఐసిసి) వన్డే ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో మెరుగైన ప్రతిభను కనబరచడం ద్వారా వాట్సన్‌ నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. వాట్సన్‌ ఆల్‌రౌండర్స్‌ జాబితాలో నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకోవడం కెరీర్‌లో ఇదే ప్రథమం. మరోవైపు వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లోనూ వాట్సన్‌ తన స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. ఏకంగా తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకొని 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ సాకిబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌ వన్డే సారథి షాహిద్‌ అఫ్రిది మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరిచి భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌కు ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన యువీ భారత్‌కు ఒంటిచేత్తో కప్పును సాధించి పెట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌కు ఐదో ర్యాంక్‌ లభించింది. గతంలో నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగిన కలిస్‌ కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. దీని ప్రభావం అతని ఆటపై పడింది. దీంతో అతను ఐదో ర్యాంక్‌తోనే సరిపెట్టుకోక తప్పదు. మరోవైపు వన్డే బ్యాటింగ్స్‌లో హాషిం ఆవ్లూ టాప్‌ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. డివిలియర్స్‌ రెండో, దిల్షాన్‌ మూడో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో డానియల్‌ వెటోరీ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ప్రైస్‌ రెండో, స్వాన్‌ మూడో ర్యాంక్‌ను పొందారు.
ఆసీస్‌దే అగ్రస్థానం...
వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకొంది. ఇటీవల ప్రపంచకప్‌ గెలుచుకున్న టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్‌కప్‌ గెలిచినా భారత్‌కు అగ్రస్థానం దక్కలేదు. బంగ్లాపై ఘన విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా 129 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌ 121 పాయింట్లతో రెండో, శ్రీలంక 118 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు తర్వాత స్థానాలను దక్కించుకొన్నాయి. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకొంది. 128 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా రెండో, ఇంగ్లండ్‌ మూడో స్థానంలో నిలిచాయి. శ్రీలంకకు నాలుగో ర్యాంక్‌ దక్కింది. ఆస్ట్రేలియా 107 పాయింట్లతో ఐదో స్థానంతో సంతృప్తి పడింది. బ్యాటింగ్‌లో సచిన్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కింది. బౌలింగ్‌లో స్టెయిన్‌ మొదటి ర్యాంక్‌లో నిలిచాడు.

ముంబైకి కొచ్చి షాక్ !


ముంబై: ఐపిఎల్‌లో కొచ్చి టస్కర్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో కొచ్చి 8వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబైకి ఇది ఓటమి కాగా, కొత్త జట్టు కొచ్చికి ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ 66 బంతుల్లోనే 12ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కొచ్చి 19 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకొంది. ఓపెనర్లు బ్రాండన్‌ మెకుల్లమ్‌ 60 బంతుల్లో 10ఫోర్లు, రెండు సిక్సర్లతో 81, మహేల జయవర్ధనే 36 బంతుల్లో 9ఫోర్లతో 56 పరుగులు సాధించి కొచ్చి విజయం కీలక పాత్ర పోషించారు. చివర్లో రవీంద్ర జడేజా 11 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25, హడ్జ్‌ 7 బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.

అట్టహాసంగా జగన్‌ నామినేషన్‌


కడప: ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌లను దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు వైఎస్‌ జగన్‌ తన తల్లి విజయమ్మ, కుటుంబసభ్యులతో నామినేషన్‌ పత్రాలను తీసుకొని ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద వుంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ సతీమణి విజయమ్మ వైఎస్‌ ను గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యం అభిమానులను కలిచివేసింది. కుమార్తె షర్మిళ తల్లిని ఓదార్చింది. అనంతరం జగన్‌ తన అనుచరులతో కలెక్టరేట్‌ చేరుకొని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశిభూషణ్‌ కుమార్‌కు ఆయన రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్‌ చేరుకున్న జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. సరిగ్గా 10.45నిముషాలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టర్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. 10.46నిముషాలకు నామినేషన్‌ సెట్‌పై సంతకాలు చేశారు. 11.04నిముషాలకు మొదటి నామినేషన్‌ సెట్‌ను, రెండవ నామినేషన్‌ సెట్‌ను 11.22 గంటలకు రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా జగన్‌ వెంట మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అడ్వకేట్‌ పుల్లారెడ్డి వున్నారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జగన్‌కు మద్ధతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. వీరిలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మారెప్ప, నెల్లూరు మేకపాటి బ్రదర్స్‌ రాజమోహన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సినీ నటి రోజా తదితరులు వున్నారు. జగన్‌ నామినేషన్‌ వేస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే ఉదయం నుండే పోలీసులు పెద్దఎత్తున కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. కలెక్టరేట్‌ నలుమూలల ను పోలీసులు దిగ్భంధనం చేశారు. సెవెన్‌రోడ్స్‌ సర్కిల్‌లోని సిండికేట్‌ బ్యాంకు సమీపంలోనే కార్యకర్తలను, అభిమానులను పోలీసులు నిలిపివేశారు.
వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అదేవిధంగా ముందుగానే కలెక్టరేట్‌ గేటు ముందుకు చేరుకున్న అభిమానులను ప్రధాన గేటు వరకు రాకుండా అఢ్డగించారు. కేవలం గుర్తింపు కార్డులు వున్న కలెక్టరేట్‌ ఉద్యోగులను, మీడియాను మాత్రమేపకార్యకర్తలకు మధ్య కొంత తోపులాట జరిగింది. కార్యకర్తలను లోపలకు వెళ్లకుండా పోలీసులు బలప్రయోగం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖ నాయకులు కూడా పపవుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐదవరోజు ఎంపీ స్థానానికి 6, అసెంబ్లిdకి ఒక నామినేషన్‌
ఉప ఎన్నికలలో నామినేషన్‌ల పర్వంలో 5వరోజు కడప ఎంపీ స్థానానికి ఆరు నామినేషన్‌లు, పులివెందుల స్థానానికి ఒక నామినేషన్‌లు దాఖలయ్యాయి. కడప ఎంపీ స్థానానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్‌లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున దాఖలు చేశారు. అలాగే చిలకలపల్లి జగన్‌ మోహన్‌ రెడ్డి, తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన కె.పద్మనరాజు, జిల్లాకు చెందిన కె.శ్రీనివాసులు రెడ్డి, పెనుబాల విజయ్‌కుమార్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్‌లను దాఖ లు చేశారు. అలాగే పులివెందుల అసెంబ్లిd స్థానానికి విజయలక్ష్మీ అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా ఒక నామినేషన్‌ పత్రాన్ని దాఖల ు చేశారు.

కళ్లు తిరిగే సంపద!


  • జగన్‌ పేరిట ఆస్తులు రూ.365 కోట్లు
  • భార్య పేరిట మరో రూ. 41.33 కోట్లు
  • 2009లో ఆయన ఆస్తి రూ. 77 కోట్లు 
  • రెండేళ్లలో ఐదొందల శాతం పెరుగుదల
  • దేశంలోని టాప్‌టెన్‌ ఆస్తిపరులైన ఎంపిల్లో నలుగురు తెలుగువారే
హైదరాబాద్‌: ఒకప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా గుర్తింపులేని తెలుగోడంటే ఈనాడు ప్రపంచమే భయపడుతోంది. ఆర్థిక సంపదను వేగంగా సృష్టించడంలో తెలుగువారు ప్రపంచానికే సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. కడప ఎమ్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేసిన జగన్‌ నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్‌కు తన సంపదల వివరాల్ని అందించారు. అధికారికంగా ఆయన ప్రకటించిన మేరకు ఆయన పేరిట 365కోట్ల సంపద ఉంటే ఆయన భార్య పేరిట 41.33కోట్ల ఆస్తులున్నాయి. జగన్‌కు వేలు, లక్షలకోట్ల సంపద ఉంటుందని ప్రజలంతా ఎప్పటి నుంచో ప్రగాడ విశ్వాసంతో ఉన్నారు. కానీ ఒక్కసారిగా కళ్ళుతిరిగిపోయే సంఖ్యను ఆయన తనంతతానుగా ప్రకటించడంతో ప్రజల కళ్ళుతిరిగాయి. 2009ఎన్నికల్లో ఆయన ప్రకటించిన సంపద మొత్తం 77కోట్లు కాగా ఇది రెండేళ్ళలోనే ఐదొందల శాతానికిపైగా పెరిగింది. గత ఏడాది ఆయన ఏకంగా 84కోట్ల అడ్వాన్స్‌టాక్స్‌ చెల్లించారు. జగనే కాదు. దేశంలోని ఎమ్‌పిల్లో అత్యధిక సంపదున్న పదిమందిలో నలుగురు తెలుగువారే. నామా నాగేశ్వరరావు 173కోట్ల ఆస్తులను ప్రకటిస్తే లగడపాటి రాజగోపాల్‌ వందకోట్లు, జి వివేక్‌ 73కోట్ల ఆస్తులున్నట్లు 2009
ఎన్నికల అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. ఎమ్‌పిల్లోనే కాదు. అంతర్జాతీయ మేగజైన్‌ ఫార్ట్యూన్‌ ప్రకటించే సంపన్నుల జాబితాలో కూడా ఎక్కువగా భారతీయులు, తెలుగువారే ఉంటున్నారు.
రాష్ట్రంలో రాజకీయ పారిశ్రామికవేత్తల ఆర్ధికాభివృద్ధి గత పదిపదిహేనేళ్ళలోనే వేగంగా సాగింది. ఇందుకు చంద్రబాబు ఆ తర్వాత వైఎస్‌ఆర్‌లు అనుసరించిన విధానాలే కారణం. కాకినాడ సీపోర్ట్స్‌ అధినేత కెవి రావు పదేళ్ళ క్రితం ఓ అతిసామాన్యుడు. ఆసియా బ్యాంక్‌ అప్పుతో నిర్మించిన పోర్టును చంద్రబాబు ఆయనకు గుత్తకిచ్చేయడంతో కెవి రావు నేడు ఆర్ధిక సంపన్నుడయ్యాడు. ముకేష్‌ అంబానీ, వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, కార్లోస్‌ స్లిమ్‌లను దాటిపోతుంటే తెలుగు పారిశ్రామికవేత్తలు ముఖేష్‌ అంబానీని దాటిపోయే వేగంతో సంపదను వృద్ధి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలరంగంతోపాటు సెజ్‌లు, ఐటి, పోర్ట్‌లు సంపదను వేగంగా వృద్ధి చేసేందుకు మార్గాలుగాఉన్నాయి. ఒకప్పుడు పేదరికంతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌లో సంపద ఇంతవేగంగా పెరిగిపోవడం, దాన్ని కేవలం కొన్ని కుటుంబాలే సొంతం చేసుకోవడం ప్రజల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగన్‌ ప్రకటించిన ఆస్తుల్ని సంప్రదాయకంగా ఎన్నికల కమిషన్‌ ఆమోదించినప్పటికీ వాస్తవ సంపద వివరాల్ని ఆదాయపన్నుశాఖ ప్రజలకు వివరించాల్సి ఉంది.

బాబా ఆరోగ్యంపై సిఎం ఆరా


  • మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
  • వాస్తవాలు తెలుసుకునే బాధ్యత గీతారెడ్డికి అప్పగింత 
  • బాబా ఆరోగ్యంపై పెనుగొండ కోర్టులో పిటిషన్‌ 
  • హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన దళిత జనసభ
హైదరాబాద్‌: పుట్టపర్తి సత్యసాయిబాబాకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. రెవిన్యూశాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవిరాజ్‌, గాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, నిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ సత్యనారాయణ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంలతో ముఖ్యమంత్రి శుక్రవారం సాయింత్రం సచివాలయంలో అరగంటసేపు సమావేశమయ్యారు. ప్రభుత్వపరంగా బాబాకు వైద్యసేవలు అందించే బాధ్యతను మంత్రి డాక్టర్‌ జె. గీతారెడ్డికి అప్పగించారు. ఇప్పటి వరకు తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని మంత్రి గీతారెడ్డి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి రఘువీరారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు.
కాలేయం పనితీరు మెరుగుపడిందని, మూత్రపిండాలకు డయాలసిస్‌ కొనసాగుతుందని, కృత్రిమ శ్వాస ఇస్తున్నారని తెలిపారు వైద్యపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ బాబా వయస్సు 85 సంవత్సరాలు దాటిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవల్సివుందన్నారు. ట్రస్టు వ్యవహారాలు పూర్తి పారదర్శకంగా మంత్రి తెలిపారు. ట్రస్టుకు సంబంధించి ఊహాగానాలు ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. సాయిబాబా ట్రస్టు కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం
ఏమాత్రం లేదన్నారు. భవిష్యత్‌లో ట్రస్టు ద్వారా నిర్విగ్నంగా కార్యక్రమాలు కొనసాగడానికి బాబా ఇప్పటికే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
బాబా ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్‌: సాయిబాబా ఆరోగ్యంపై వాస్తవాలు వెల్లడించాలంటూ అనంతపురం జిల్లా పెనుగొండలో భాస్కరరెడ్డి అనే న్యాయవాది శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ స్వీకరించిన కోర్టు కేసు విచారణను శనివారం నాటికి వాయిదా వేసింది. మరోవైపు దళిత జనసభ బాబా ఆరోగ్య విషయంలో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బాబా పరిస్థితిపై నిజాలు వెల్లడించాలని, ట్రస్టుబోర్టు, ఆసుపత్రి యాజమాన్యంపై అనుమానాలు ఉన్నాయని, బాబాను భక్తులకు చూపించాలని దళిత జనసభ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుండగా, బాబాకు మందులు ఇవ్వడం కంటే ప్రజల్లోకి తీసుకువస్తే చాలా మంచిదని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు కోరారు. బాబాకు ఇంత కష్టం రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.