Saturday, April 2, 2011

ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కాయ్‌ రాజా కాయ్‌


హైదరాబాద్‌ : భారత్‌, శ్రీలంక జట్ల మధ్య శనివారం జరగనున్న ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా పందాలు మొదలయ్యాయి. పందాలు కాసే వారి నుంచి బుకీలు కాసుల పంటలు పండించుకుంటున్నారు. రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని ప్రాంతాలలో కాయ్‌ రాజా కాయ్‌ అంటూ ఫంటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
క్రికెట్‌ మ్యాచ్‌లు వస్తే బుకీలు, ఫంటర్లకు పండగేనని అందరికి తెలిసిందే. ఇదివరకటిలా కాకుండా అంతా టెలిఫోన్‌లోనే పందాలు కాయడం కూడా విదితమే. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత నిఘా వుంచినా పెద్దగా ప్రయోజనం వుండడం లేదు. ఇంతకు ముందు కేవలం ఇండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ల సమయంలోనే జరిగే ఈ బెట్టింగ్‌లు అటు పిమ్మట భారత్‌ ఏ దేశంతో ఆడినా సరే పందాలు కాసే వరకు వెళ్లింది. మూడు రోజుల క్రితం ఇండియా, పాకిస్తాన్‌ ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా బుకీల హల్‌చల్‌ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో బెట్టింగ్‌ రాయుళ్లు పట్టుబడడం, లక్షలాది రూపాయలు దొరకడం ఒక ఎత్తు కాగా శనివారం నాటి ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అంతకు పదింతల బెట్టింగ్‌ జరిగే వీలుందని పోలీసులకు సమాచారం అందింది. ఈ బెట్టింగ్‌లో సగానికి పైగా హైదరాబాద్‌లోనే జరుగుతుందని కూడా పోలీసులకు ముందుగానే సమాచారం అందింది. బెట్టింగ్‌ రాయుళ్లపై పోలీసులు ని ఘా వుంచగా పందాలు కాసే వారు మరో అడుగుముందుకు వేసి అజ్ఞాతంలోకి వెళ్లి మరీ తమ చీకటి కార్యకలాపాలు మొదలు పెట్టారు. శనివారం మధ్యాహ్నం మ్యాచ్‌ మొదలు కానుండగా శుక్రవారం ఉదయం నుంచే బుకీలు, ఫంటర్లు పందెంరాయుళ్ల నుంచి వసూళ్లు ప్రారంభించారు. నగరంలోని పశ్చిమ, మధ్య, ఉత్తర మండలాల్లో ఈ బెట్టింగ్‌లు జోరుగా జరుగుతున్నాయని తెలి సింది. ఇండియా గెలుపు పై ఒకటికి పది నుంచి 20 వరకు పందాలు కొనసాగుతుండగా కొన్నిచోట్ల ఇది 25 వరకు వుంది. ఇదే సమయంలో శ్రీలంక గెలుపు విషయంలోనూ ఒకటికి పది నుంచి 15 వరకు పందాలు కాస్తున్నారు. ఇరుజట్ల గెలుపు ఓటములతో పాటు సచిన్‌ టెండూల్కర్‌ సెంచరీ చేస్తాడని, జహీర్‌ఖాన్‌ ఎక్కువ వికెట్లు తీస్తాడని కూడా పందాలు కాస్తున్నారు. దీంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ సచిన్‌ అని కొందరు, యువరాజ్‌ సింగ్‌ అని మరికొందరు, దిల్షాన్‌ అని ఇంకొందరు పందాలు కాస్తున్నారు. పోలీసులకు దొరకకుండా బుకీలు, ఫంటర్లు కొత్త ఎత్తుగడలు ఎంచుకోవడంతో బెట్టింగ్‌ రాయుళ్ల హవా కొనసాగుతోంది.
మద్యం అమ్మకాలపై ఆంక్షలు...
బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై నిఘా
ఇదిలావుండగా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలపై పోలీ సులు ఆంక్షలు విధించారు. సాధారణ రోజుల్లో ఉన్నట్లుగా కాకుండా శనివారం రోజున మద్యం అమ్మ కాలను రాత్రి తొమ్మిది పది గంటల మధ్య నిలిపి వేయాలని ఆయా ప్రాంతాల పోలీసులను ఆదేశిం చారు. మద్యం దుకాణాల వద్ద ఎవరూ మద్యం సేవిం చకుండా చూడాలని కూడా ఆదేశించారు. దీంతో పాటు బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వద్ద నిఘా పెంచారు. మ్యాచ్‌ సందర్భంగా మద్యం ప్రియులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా, గలాటా చేయకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మద్యం వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరరించాలని, ఇదే సమయంలో మందుబాబులు చిందులు తొక్కితే కటకటాల్లో నెట్టాలని ఆదేశించారు.
జంట కమిషనరేట్లలో భారీ భద్రత
వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఉగ్రవాదులు దేశంలోని పలు ప్రాంతాలలో దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌లలో భద్రతను కట్టుదిట్ట ం చేశారు. కీలక ప్రాంతాలలో సాయుధ పహరాను ఏర్పాటు చేయగా జనం ఎక్కువగా గుమికూడే చోట్ల బందోబస్తును పెంచారు.

No comments:

Post a Comment