Tuesday, April 5, 2011

వన్డేలకు పూర్వవైభవం!


కొంతకాలంగా మనుగడ కోసం కొట్టుమిట్టాడు తున్న వన్డే క్రికెట్‌కు ఉపఖండం ప్రపంచకప్‌ కొత్త ఊపునిచ్చింది. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన పదో వరల్డ్‌కప్‌ అంచనాలకు మించి సక్సెస్‌ అయ్యింది. భారత్‌ విశ్వ విజేతగా నిలువడంతో వన్డే క్రికెట్‌ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. ముంబైలో భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ వన్డే క్రికెట్‌ దిశనే మార్చేసిందిగా ఉంది. ఆస్ట్రేలియా ఏకపక్ష విజయాలతో వన్నె తగ్గిన వన్డేలకు ఉపఖండం ప్రపంచకప్‌ కొత్త మార్గం చూపించింది. దాదాపు 45 రోజులకు పైగా సాగిన మెగా టోర్నమెంట్‌ క్రికెట్‌ ప్రేమికులను ఉర్రుతలూగించింది. పసికూనలు ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, కెనడా జట్లు కొన్ని మ్యాచుల్లో అద్భుత పోరాటపటిమను కనబరిచిన పెద్ద జట్లకు గట్టి పోటీ ఇచ్చాయి. కొన్ని మ్యాచులు తప్ప అన్ని పోటీలు ఉత్కంఠభరితంగానే సాగాయి. భారత్‌-బంగ్లాదేశ్‌ పోరుతో ప్రారంభమైన జోష్‌ చివరి వరకు సాగింది. ఉపఖండం క్రికెట్‌ ప్రేమికులు ప్రతి మ్యాచ్‌ను ఎంతో ఆసక్తి తిలకించారు. మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఏవో కొన్ని మ్యాచులు తప్పితే మిగతావాటికి అభిమానుల నుంచి మంచి స్పందనే వచ్చింది. భారత్‌, లంక, బంగ్లాదేశ్‌లు తలపడిన అన్ని మ్యాచులు అభిమానులతో కిక్కిరిసి పోయాయి. పసికూనగా బరిలోకి దిగిన ఐర్లాండ్‌ బలమైన ఇంగ్లండ్‌ జట్టును కంగుతినిపించడంతో ప్రపంచకప్‌కు కొత్త ఊపునిచ్చింది. బంగ్లా, నెదర్లాండ్స్‌, భారత్‌, ఇంగ్లండ్‌ తదితర జట్లతో జరిగిన మ్యాచుల్లో ఐర్లాండ్‌ అద్భుత ప్రతిభను కనబరిచింది. కెనడా కూడా పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, జింబాబ్వే వంటి జట్లకు గట్టి పోటీనిచ్చింది. అంతేగాక జింబాబ్వే కూడా మెరుగ్గానే రాణించింది.
భారత్‌-పాక్‌ మ్యాచ్‌తో...
ఇక, చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య మొహాలీలో జరిగిన సెమీఫైనల్‌ పోరు ప్రపంచకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోరు సరిహద్దు దేశాల సంబంధాలకు కొత్త ఊపునిచ్చింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ వన్డే క్రికెట్‌కు కొత్త దిశను నిర్దేశించింది. ఈ మ్యాచ్‌కు లభించిన ఆదరణ ఐసిసికి ఊరట నిచ్చింది. అప్పటివరకు సాదాసీదాగా సాగిన వరల్డ్‌కప్‌ దాయదుల సమరంతో ప్రాధాన్యత సంతరించుకొంది. సెమీస్‌లో భారత్‌ విజయం సాధించడంతో ఆదరణ మరింత పెరిగింది. ఇక, ఫైనల్లో లంకను ఓడించి టీమిండియా విశ్వవిజేతగా నిలువడంతో క్రికెట్‌ స్వరూపమే మారిపోయింది. భారత్‌ చిరస్మరణీయ విజయంతో వన్డేలకు ఆదరణ మరింత పెరగడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మనుగడ కోసం మల్లగుల్లాలు పడుతున్న సంప్రదాయ వన్డే క్రికెట్‌ మళ్లిd పూర్వవైభవం సాధించుకోవడం ఖాయం.

No comments:

Post a Comment