Friday, April 22, 2011

ప్రపంచవ్యాప్తంగా గుడ్‌ఫ్రెడే ప్రార్ధనలు


న్యూఢిల్లి : జీసెక్రీస్ట్‌ ను శిలువ వేయడాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలూ, ఊరేగింపులూ, ఐహిక సుఖాలను త్యజించడానికి చిహ్నంగా ఉపవాసాలతో ఘనంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు జరిగాయి. కొవ్వొత్తులను చేతితో పట్టుకిని, వందలూ, వేలాది మంది క్రిస్టియన్‌లు వివిధ ప్రాంతాలలో చెక్క క్రాస్‌లను ధరించి భక్తి శ్రద్ధలతో ఊరేగింపులు జరిపారు. జెరూసలేం పాత నగరంలో వేల సంఖ్యలో క్రిష్టియన్లు ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇక్కడే రోమన్లు క్రీస్త్‌కు శిలువ వేశారు. లాటిన్‌ పాట్రియార్క్‌ ఫౌద్‌ తవల్‌ నాయకత్వంలో కాథలిక్‌ చర్చిల ప్రతినిధులు జరూసలేంలో ఉదయపు ఊరేగింపు నిర్వహించారు. భారత దేశంలోకూడా దేశ వ్యాప్తంగా ఘనంగా గుడ్‌ ఫ్రైడే వూరేగింపులూ ప్రత్యేక ప్రార్థనలూ జరిగాయి. కేరళ క్రిస్టియన్లు రోజంతా ప్రార్థనలు జరిపారు. పట్టణాలూ, పల్లెలలో సైతం ఊరేగింపులు సాగాయి. నాగాలాండ్‌లోకూడా కేథలిక్కులు పెద్ద ఎత్తున కోహిమాలో గుడ్‌ ఫ్రైడే వేడుకలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో “గుడ్‌ఫ్రైడే‘
హైదరాబాద్‌,ఆంధ్రప్రభ ప్రతినిధి : క్రైస్తవుల ఆరాధ్యదైవమైన యేసుక్రీస్తు (జీసస్‌ క్రైస్ట్‌) చనిపోయిన రోజైన “గుడ్‌ఫ్రైడే‘ను శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా యేసుక్రీస్తు సిలువపై పలికిన యేడు మాటలను ధ్యానించారు. కేథలిక్‌ చర్చ్‌లలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని నాటకాలుగా ప్రదర్శించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలోని కేథలిక్‌, బాప్టిస్ట్‌, మెథడిస్ట్‌, మెన్నోనైట్‌, సిఎస్‌ఐ తదితర చర్చిలలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్‌లోని సిఎస్‌ఐ చర్చితో పాటు విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌, కర్నూలు నగరాలలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. లోకంలోని పాపాలను కడిగి వేసేందుకే జీసస్‌ క్రైస్ట్‌ సిలువపై చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్లారని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. ఆయన మరణంతోనే పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తం అనేవి మానవ జీవితాలకు ఉన్నాయని అంటారు. 2 వేల సంవత్సరాల క్రితం రోమన్‌ సామ్రాజ్యంలో పేదలు, అణచివేయబడిన ప్రజల పక్షాన తన గొంతును విప్పి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు యేసుక్రీస్తు ప్రయత్నించారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి విస్తుపోయిన రోమన్‌ పాలకులు, ఆయన అలాగే ప్రజల్లో తిరిగితే తమ ప్రభుత్వాలు కూలిపోతాయనే భయంతో అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో చిత్రహింసలు పెట్టి సిలువ వేసి చంపేస్తారు. శుక్రవారం నాడు ఆయన చనిపోయి తిరిగి ఆదివారం పరలోకం వెళతారు. ఆయన చనిపోయి పునరుత్థానుడవటంతో తమ పాపాలకు ప్రాయశ్చిత్తం లభించిందని క్రైస్తవులు నమ్ముతారు. అందువల్ల ఆయన చనిపోయిన దినాన్ని “గుడ్‌ఫ్రైడే‘గా ఆచరిస్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెల మూడవ శుక్రవారాన్ని క్రైస్తవులు, యూదులు “గుడ్‌ఫ్రైడే‘గా ఆచరిస్తారు.

No comments:

Post a Comment